- ఆ హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉందని హైకోర్టు కామెంట్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట, నకిరేకల్, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు తదితర మున్సిపాలిటీలకు ఎన్నికలను నిలిపివేయాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఉత్తర్వులు ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, మరొకరు విడివిడిగా పిల్స్ దాఖలు చేశారు. ఈ పిల్స్ ను జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి సోమవారం విచారించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత జోక్యం చేసుకోవడానికి కోర్టులకు ఆస్కారం లేదని జడ్జి పేర్కొన్నారు. విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, మున్సిపల్ శాఖలు తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణను వాయిదా వేశారు. ఎన్నికలు నిర్వహించాలా? వాయిదా వేయాలా? నిర్ణయించాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమని, హైకోర్టు కాదని జస్టిస్ అభిషేక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసుల విచారణ ఆన్ లైన్ లోనే.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున అన్ని స్థాయిల్లోని కోర్టుల్లో ఫిజికల్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కోర్టుల్లోనూ ఆన్లైన్ ద్వారా కేసుల విచారణ చేయాలని నిర్ణయించింది. హైకోర్టు, జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులన్నింటిలోనూ 50 శాతం సిబ్బంది విధుల్లో ఉండాలని, మిగిలిన 50 శాతం మంది అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.