
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వింత.. ఏళ్లుగా డ్యూటీ చేస్తున్న అధికారులు
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు జీతం లేకుండానే పనిచేస్తున్నారు. ఒకట్రెండు నెలలు కాదు ఏళ్లకు ఏళ్లుగా వారు జీతాలు తీసుకోకుండానే డ్యూటీకి వస్తున్నారు. అయితే విధుల్లో నిర్లక్ష్యమే వారికి జీతాలు రాకుండా చేసింది. కొందరు మూడు నాలుగేళ్లుగా ఇలా పని చేస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఓ అధికారి 8 ఏళ్లుగా శాలరీ లేకుండానే కొనసాగుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే ఇలాంటి వారు వంద మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎందుకీ పరిస్థితి
విద్యుత్ సంస్థల పరిధిలోని సర్కిళ్లు, డివిజన్లలో ఏఈ, ఏడీఈ స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. సదరు అధికారి పరిధిలో జరిగే వర్క్ ఆర్డర్లన్నీ వారి ఐడీతోనే రికార్డు అవుతాయి. కొత్త లైన్ల టెండర్లు, ఎస్టిమేషన్లు, మెటీరియల్, పరికరాల వినియోగం తదితర పనులన్నీ చేపడతారు. ఎప్పటికప్పుడు ఈ పనులన్నీ పూర్తి చేయాలి. అయితే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వర్క్ ఆర్డర్లను క్లోజ్ చేయకుండా పెండింగ్లో పెడుతున్నారు. ఆ అధికారి ట్రాన్స్ఫర్ అయ్యే టైమ్కి వర్క్ ఆర్డర్లన్నీ పెరిగిపోతున్నాయి. ఒకవేళ అధికారి బదిలీ అయితే వర్క్ ఆర్డర్లన్నీ క్లోజ్ చేసి లాస్ట్ పే సర్టిఫికెట్(ఎల్పీసీ) తీసుకోవాలి. ఇవి క్లోజ్ చేయకపోతే ఎల్పీసీ ఇవ్వరు. అధికారి ట్రాన్స్ఫరై వేరే సర్కిల్కు వెళ్లినా ఎల్పీసీ ఇస్తేనే వేతనం చెల్లిస్తారు. ఇలా వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేసే వరకు వేతనం నిలిపేస్తారు. ఎల్పీసీలు రాక కొందరు ఏళ్ల తరబడి వేతనం లేకుండా పని చేస్తున్నట్లు సమాచారం.
అక్రమాలకు ప్రోత్సాహం
విద్యుత్ సంస్థల రూల్స్ అక్రమాలను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగులకు కొంత గడువిచ్చి వర్క్ ఆర్డర్లు పూర్తి చేసే చాన్స్ ఇవ్వాలని, అప్పటికీ పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.జీతం ఆపేయడంతో కాంట్రాక్టు పనుల్లో 5 శాతం నుంచి 7 శాతం వరకు కమీషన్లు దండుకుంటూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నా యి. కొందరు సరిగ్గానే విధులు నిర్వహిస్తున్నా పైఅధికారులు వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నిజాయితీగా పని చేసే అధికారులు అప్పులు చేసి జీతం వచ్చే వరకు కాలం వెళ్లదీస్తున్నట్లు సమాచారం.