ఆమె ఫ్రెండ్ మాత్రమే..తనతో నాకు ఏ సంబంధమూ లేదు

ఆమె ఫ్రెండ్ మాత్రమే..తనతో నాకు ఏ సంబంధమూ లేదు

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షెనహాన్‌తో తనకు ఎఫైర్‌ ఉందంటూ వస్తున్న వార్తలను ఎలాన్‌ మస్క్‌ ఖండించారు. సెర్గీ బ్రిన్‌ కు, మస్క్‌కు మధ్య మైత్రి చెడిందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. దీనిపై ఎలాన్ మస్క్‌ వివరణ ఇచ్చారు. ‘ఇవన్నీ చెత్త కథనాలు. సెర్గీ, నేను మంచి మిత్రులం. నిన్న రాత్రే మేం పార్టీ చేసుకున్నాం. గత మూడేళ్లలో నికోల్‌ను రెండుసార్లే కలిశాను. అప్పుడు కూడా మా చుట్టూ చాలా మంది ఉన్నారు. రొమాంటిక్‌గా ఏమీ లేదు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి వేరుగా ఉంటున్న సెర్గీ బ్రిన్‌, నికోల్ షెనహాన్ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు విడిపోవడానికి ఎలాన్ మస్క్‌తో నికోల్‌తో సంబంధమే కారణమని పలు కథనాలు వెలువడ్డాయి. 2021 డిసెంబరులో మియామీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా నికోల్, మస్క్ దగ్గరయ్యారని పలు కథనాలు వెలువడ్డాయి. 

సెర్గీ బ్రిన్‌, ఎలాన్ మస్క్ చాలా కాలం నుంచి మంచి మిత్రులు. మస్క్ కంపెనీకి చెందిన టెస్లా సంస్థ తయారు చేసిన తొలి కార్లను అందుకున్న వారిలో సెర్గీ కూడా ఒకరు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో టెస్లా కార్యకలాపాలు కొనసాగించేందుకు సెర్గీ.. మస్క్ కు 5 లక్షల డాలర్ల సాయం చేశారు. మస్క్ కు చెందిన కంపెనీల్లో సెర్గీకి కూడా పెట్టుబడులు ఉన్నాయని తెలుస్తోంది.