ట్విట్టర్ కొత్త ఖాతాల పునరుద్ధరణలో భాగంగా ఎలాన్ మస్క్ అనేక మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని నిషేధించిన ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించారు. అదే తరహాలో ట్రంప్ అకౌంట్ ను కూడా పునరుద్ధరించే విషయంపై దృష్టి సారించిన మస్క్.. ఆయన ఖాతాను మళ్లీ కంటిన్యూ చేయాలా, వద్దా అన్న దానిపై పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ లో దాదాపు51.8% మందికి పైగా మంది పునరుద్ధరణకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఖాతాపై ఉన్న నిషేధాన్ని తొలగించి, మళ్లీ కంటిన్యూ అవుతుందని మస్క్ ట్వీట్ చేశారు. దీంతో ట్రంప్ మళ్లీ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారనే వార్త ట్రెండింగ్ గా మారింది.
ట్రంప్ ఖాతాపై నిషేధం ఎందుకంటే...
2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. విధ్వంసం సృష్టించారు. వారి రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య.. ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు.. ఫేస్బుక్, ట్విట్టర్ ప్రకటించాయి.