కొన్ని రోజుల క్రితం నుంచి టెక్నాలజీలో రారాజుగా దూసుకుపోతున్న చాట్జీపీటీకి పోటీగా ఏఐ చాట్బోట్ను తీసుకొచ్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందుకోసం మస్క్ టీమ్ను సైతం ఎంపిక చేసుకున్నారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై తాజాగా దాదాపు 6నెలల పాటు AI సిస్టమ్లను పాజ్ చేయాలని పిలుపునిస్తూ బహిరంగ లేఖపై సంతకం చేశారు. అంతేకాదు కొత్త కృత్రిమ మేధస్సు కంపెనీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది ఫైనాన్షియల్ టైమ్స్ ఇచ్చిన నివేదికల ప్రకారం, X.AI Corp అనే కొత్త కృత్రిమ మేధస్సు (AI) కంపెనీని మస్క్ స్థాపించినట్టు తెలుస్తోంది.
X.AI Corp గురించిన పూర్తి వివరాలు సీక్రెట్ గా ఉంచినప్పటికీ ఇప్పటికే పలు నివేదికలు మస్క్ నిజాలను చెప్పగలిగే AI మోడల్ ను రూపొందించడంపై దృష్టి సారించాయని తెలిపాయి. ChatGPTకి పోటీగా ఓ ప్రముఖ AI లాంగ్వేజ్ మోడల్ ను అభివృద్ధి చేయాలని చూస్తున్నట్లు తేల్చి చెప్పాయి. గత కొన్ని సంవత్సరాల కిందటే ఏఐపై వ్యతిరేకత వ్యక్తం చేసిన మస్క్.. అందరికీ సురక్షితంగా ఉండేలా ఏఐ ప్లాట్ఫామ్లు తయారవుతున్నాయా లేదా అని పరిశీలించేందుకు ప్రభుత్వ విభాగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవలి కాలంలో చాట్ జీపీటీకి వస్తోన్న ఆదరణ చూసి ఆయన కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది.
AI ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మస్క్ డేటా సెంటర్లలో ఒకదానిలో AI అభివృద్ధి కోసం 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPUలు) కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తన కొత్త ప్రాజెక్టులో డబ్బు పెట్టడానికి టెస్లా, స్పేస్ఎక్స్ పెట్టుబడిదారులతోనూ చర్చలు జరుపుతున్నాడని టైమ్స్ నివేదించింది.
మార్కెట్ లో ఇప్పటికే అత్యంత పోటీతత్వం ఉన్న AI కి వ్యతిరేకంగా తీసుకురానున్న X.AI Corp ఎలా రాణిస్తుందో, ChatGPTకి వ్యతిరేకంగా డెవలప్ చేయడంలో విజయవంతమవుతుందా, లేదా అనేది చూడాలి. ఇక మరోవైపు గూగుల్ సైతం బార్డ్ పేరుతో ఏఐ చాట్బోట్ను తీసుకొస్తోంది. దీన్ని ప్రపంచానికి ఇప్పటికే పరిచయం చేసిన గూగుల్.. ప్రస్తుతం గూగుల్ బార్డ్ టెస్టింగ్ జరుగుతోంది. రానున్న వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది.
