- సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్
- వెనక్కి తగ్గిన శ్రీలంక గుడి
ఏనుగు అనగానే మనకు భారీ ఆకారం, కండ పుష్టే గుర్తుకొస్తది. కానీ ఈ ఏనుగు మాత్రం ఎముకలు తేలి స్కెలెటన్లా మారిపోయింది. దాని పేరు టికిరి. వయసు 70 ఏళ్లు. శ్రీలంకలో ఉంటుంది. ఈ ఏనుగునే శ్రీలంకలోని ప్రముఖ గుడి ‘టెంపుల్ ఆఫ్టూత్’లో ఏటా నిర్వహించే పెరాహెరా ఫెస్టివల్లో పరేడ్ చేయించేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. అయితే ఓ బుద్ధిస్ట్ పేజీలో ఆ ఏనుగు ఫొటోలను షేర్ చేయడం, నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ‘‘సరైన పోషకాహారం లేక టికిరి బాగా జబ్బు పడింది. ఈ ఏడాది నిర్వహించే పెరాహెరా ఉత్సవంలో పాల్గొనబోతున్న 60 ఏనుగుల్లో ఇదీ ఒకటి. రోజు తప్పించి రోజు సాయంత్రం కాగానే దానితో పరేడ్ చేయిస్తున్నారు. శిక్షణ ఇస్తున్నారు. పొద్దుపోయే దాకా దాన్ని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ పోడి మల్లి అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇలా బక్కచిక్కిపోయిన ఏనుగును హింసపెట్టడం అమానవీయ చర్య అని కొందరు పెదవి విరుస్తున్నారు. చావుకు దగ్గరవుతున్న దానిని ఇలా పనుల పేరిట హింసించడం తగదంటున్నారు.