దెబ్బకు దెబ్బ కొట్టారు: ఎట్టకేలకు ఇంగ్లాండ్ విజయం

దెబ్బకు దెబ్బ కొట్టారు: ఎట్టకేలకు ఇంగ్లాండ్ విజయం

తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. ఎట్టకేలకు మూడో టెస్టులో విజయాన్ని అందుకుంది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట పూర్తిగా రద్దయినా.. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియటం గమనార్హం.

27/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్, రెండో సెషన్‌లోనే మ్యాచును ముగించింది. సన్ రైజర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ (75) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. ఆఖర్లో బ్రూక్ వెనుదిరిగినా.. క్రిస్‌ వోక్స్‌ (32 నాటౌట్‌), మార్క్‌ వుడ్‌ (16 నాటౌట్‌) జోడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 237 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అనంతరం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ ముంగిట 251 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జూలై 19 నుంచి ప్రారంభంకానుంది.