బీహార్​లో రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

బీహార్​లో రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా సమస్తిపూర్​లో ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సుమారు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు కనెన్ట్‌ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు.

కప్లింగ్ తెగిపోవడంతో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం ( జులై 29) రెండుగా విడిపోయింది. అధికారుల అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది. బీహార్‌లోని  సమస్తిపూర్-ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని పూసా స్టేషన్ సమీపంలో ఇంజిన్, కోచ్ లను కలిపే కప్లింగ్ విరిగిపోవడంతో రైలు రెండు బాగాలుగా విడిపోయింది. విషయాన్ని గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఇంజిన్ ను నిలిపివేశాడు. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సోన్‌పూర్ డివిజన్ అధికారులు దీని తర్వాత వచ్చే రైళ్లను తక్షణమే నిలిపివేయడంతో  పెద్ద ప్రమాదం తప్పింది  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదని రైల్వే అధికారులు తెలిపారు.ఈ ఘటనపై  సోన్‌పూర్ రైల్వే డివిజన్ కార్యాలయానికి సమాచారం అందించడంతో.. రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైలు కోచ్‌ను కనెక్ట్ చేశారు. అనంతరం రైలు ఢిల్లీకి బయలుదేరిందని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.