
- లాసెట్లో క్వాలిఫై అయినోళ్లలో నాల్గోవంతు బీటెక్ చేసినోళ్లే..
- ఎంబీబీఎస్, ఎంబీఏ, ఫార్మసీ పూర్తిచేసినోళ్లూ లా వైపు మొగ్గు
- సేవ కోసం కొందరు, కొత్త కెరీర్ కోసం ఇంకొందరు..
హైదరాబాద్, వెలుగు: లా కోర్సులపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతున్నది. గతంలో కేవలం బీఏ, బీకాం చేసినోళ్లే ఎక్కువ మంది లా కోర్సుల్లో చేరే వాళ్లు. కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్లూ.. లా వైపు మొగ్గుచూపుతున్నారు. ఈసారి లాసెట్ క్వాలిఫై అయినోళ్లలో ఏకంగా నాల్గోవంతు ఇంజనీరింగ్ వాళ్లే ఉండడం ఇందుకు నిదర్శనం. కొందరు కొత్త కెరీర్ ప్రారంభించేందుకు ఈ కోర్సుల్లో చేరుతుండగా, మరికొందరు సేవ చేసే ఆలోచనతో వస్తున్నట్టు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించిన లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు ఇటీవలే రిలీజ్ అయ్యాయి. మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సులో చేరేందుకు 41,210 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 32,118 మంది మాత్రమే పరీక్ష రాశారు. దీంట్లో 21,715 మంది క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షను వివిధ రెగ్యులర్ డిగ్రీ, దాని సమానమైన 24 కోర్సులు చేసినోళ్లున్నారు. అయితే, బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి రెగ్యులర్ డిగ్రీ అభ్యర్థులతో పోటీగా ప్రొఫెషనల్ కోర్సులైన బీటెక్, బీఈ అభ్యర్థులూ ఉన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ లా, పేటెంట్ లా, సైబర్ లా వంటి ప్రత్యేక న్యాయరంగాల్లో పెరుగుతున్న అవకాశాలు కూడా ప్రొఫెషనల్ కోర్సుల వాళ్లు ఇటువైపు మొగ్గు చూపేందుకు కారణంగా తెలుస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం, న్యాయపరమైన నైపుణ్యాలు తెలుసుకునేందుకు చాలామంది లా కోర్సులను ఎంచుకుంటున్నట్టు విద్యావేత్తలు చెప్తున్నారు. మరోపక్క కొందరు రిటైర్డ్ అయిన వాళ్లు, వీఆర్ఎస్ తీసుకున్నోళ్లు కూడా లా కోర్సులు చేసి, సెకండ్ కేరీర్ ప్రారంభించేందుకు లా వైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా..
లా కోర్సుల్లో చేరేందుకు వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. 60 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు కూడా ఎల్ఎల్బీ (3 ఏండ్ల కోర్సు)లో 247 మంది, ఎల్ఎల్బీ (5 ఏండ్ల కోర్సు)లో 11 మంది, ఎల్ఎల్ఎంలో 75 మంది ఉన్నారు. మరో వైపు మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సులో 22 ఏండ్లలోపు వాళ్లు క్వాలిఫై అయింది కేవలం 1,961 మంది మాత్రమే. 23– 30 ఏండ్లలోపు 8,084 మంది, 31–40 ఏండ్లలోపు 8,207 మంది, 41–50 ఏండ్లలోపు 2,672 మంది, 51– 60 ఏండ్లలోపు 544 మంది ఉన్నారు. ఈ లెక్కలు యూత్తో పాటు అనుభవజ్ఞులు కూడా న్యాయవృత్తి పట్ల ఆసక్తి చూపుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.
9,188 మంది బీటెక్చేసినోళ్లే..
ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు లాసెట్లో అర్హత సాధించడం, సాంప్రదాయ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు మించి భిన్నమైన కెరీర్ మార్గాలను ఎంచుకోవడం ఆసక్తి కలిగిస్తున్నది. లాసెట్కు 41,210 మంది అప్లై చేసుకుంటే.. వారిలో బీకాం 12,656, బీఎస్సీ 9,507 మంది తర్వాత.. బీటెక్ అభ్యర్థులు 9,188 మంది ఉన్నారు. బీటెక్ అభ్యర్థులు 6,816 మంది పరీక్ష రాయగా.. 5,182 మంది క్వాలిఫై అయ్యారు. దాదాపు నాల్గోవంతు మంది ఇంజినీరింగ్ వాళ్లే ఉన్నారు. మిగిలిన ప్రొఫెషనల్ కోర్సుల వాళ్లూ లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాసెట్ క్వాలిఫై అయిన వాళ్లలో ఎంబీబీఎస్ వాళ్లు 79, బీఫార్మసీ 384 మంది, బీడీఎస్ 42, బీబీఏ 431, బీసీఏ చేసినోళ్లు161 మంది ఉన్నారు.