బాన్సువాడకు పోచారం చేసిందేమి లేదు : ఏనుగు రవీందర్ రెడ్డి

బాన్సువాడకు పోచారం చేసిందేమి లేదు : ఏనుగు రవీందర్ రెడ్డి

వర్ని, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గానికి పోచారం శ్రీనివాస్​రెడ్డి చేసిందేమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శించారు. మోస్రాలోని ప్రసిద్ధ రామ్​మందిరంలో ఆయన గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో మండల కేంద్రం మోస్రాలో, గోవూరు, నెంబర్​తండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏనుగు మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్​ఇస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. 40 ఏండ్లుగా బాన్సువాడ రాజకీయాలను ఏలుతున్న పోచారం నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఆయన కుటుంబమే బాగు పడిందన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎలమంచిలి శ్రీనివాస్​రావు, చందూరు జడ్పీటీసీ అంబర్ సింగ్, మోస్రా మండలాధ్యక్షుడు లక్ష్మణ్, హరి నారాయణ, ప్రవీణ్ గౌడ్, సైనిపురం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.