హైదరాబాద్, వెలుగు: చెరువుల పరిరక్షణ చాలా ముఖ్యమని స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఆసక్తి గల విద్యార్థులు ఒక ఏరియాను దత్తత తీసుకొని క్లీన్ చేయాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్) డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు అన్నారు. యూఓహెచ్ క్యాంపస్లో బుధవారం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్, వైల్డ్ లెన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. శానిటరీ, హార్టికల్చర్ డిపార్ట్ మెంట్లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. బప్పాలో చెరువు క్లీన్ డ్రైవ్ చేపట్టారు.
వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సిటీలో బుధవారం ర్యాలీలు, అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ రక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని వక్తలు పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని నివారించాలంటే చెట్లను పెంచాలని, వాన నీటితో భూగర్భ జలమట్టం పెరిగేలా చూడాలని కోరారు. ప్రకృతి నాశనం కాకుండా బతుకుతూ.. మిగతా జీవాలను బతకనివ్వాలన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం గ్రేటర్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని అవగాహన కల్పించారు. ర్యాలీ తీసి ప్రకృతిని నాశనం చేయొద్దని నినదించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కోరారు. వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. కొన్నిచోట్ల మొక్కలు, చెత్త బుట్టలు అందజేశారు.