స్త్రీ, పురుష సమానత్వానికి జై కొట్టిన బీసీసీఐ

స్త్రీ, పురుష సమానత్వానికి జై కొట్టిన బీసీసీఐ

బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును  చెల్లిస్తామని ప్రకటించింది. బీసీసీఐతో కాంట్రాక్టు కుదుర్చుకునే సీనియర్ పురుష క్రికెటర్లతో సమానంగా ఇకపై మహిళా క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫీజును పొందుతారని స్పష్టం చేసింది.  టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్ ఫీజు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలను ఇకపై మహిళా క్రికెటర్లు కూడా తీసుకుంటారని వెల్లడించింది.

దీనిపై బీసీసీఐ సెక్రెటరీ జై షా ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.  స్త్రీలపై వివక్షను నిర్మూలించే దిశగా.. లింగ సమానత్వాన్ని సాధించేందుకే బీసీసీఐ ఈ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.  ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో తనకు మద్దతు పలికిన బీసీసీఐ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కూడా ఇదే విధమైన  నిర్ణయాన్ని తీసుకుంది.