‘వరంగల్ మెగా కాకతీయ టెక్స్ టైల్ పార్క్ పనులను ఆరు నెలల్లో మొదలుపెట్టకుంటే మంత్రి పదవి వదులుకుంటా. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీపై బండి సంజయ్, కిషన్రెడ్డి ఏం చేస్తారో చెప్పాలె’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున వరంగల్ లో ప్రచారం చేశారు. తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడారు. తమ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఒక్కపని చేయలేని వాళ్లు.. వరంగల్ లో ఏదో చేస్తామంటూ ఝూటా మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, మోసకారి కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగల్లా మాయమాటలతో జనాలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి అప్పగించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కిషన్రెడ్డి, సంజయ్లు.. రైల్వే అధికారులకు భూమి అప్పగించిన ఫోటోలు, పత్రాలను చూడాలంటూ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడంలేదని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరంతర పోరాటం చేస్తామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ తదితరులు హన్మకొండ జయశంకర్ పార్కులో సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
