న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ అరబిందో ఫార్మా హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలోని స్టెరైల్ ఇంజెక్షన్ ప్లాంట్లో పలు లోపాలు, అతిక్రమణలను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) గుర్తించింది. స్టెరిలైజేషన్ ప్రాసెస్ను రూల్స్ ప్రకారం చేయడం లేదని, నిర్వహణ విధానాల్లో లోపాలు ఉన్నాయని ఎఫ్డీఏ అభ్యంతరం తెలిపింది. ఇంజెక్షన్ల తయారీని ప్రొటోకాల్స్ ప్రకారం జరగడం లేదని విమర్శించింది. గత ఏడాది మార్చిలోనూ ఇదే యూనిట్ పనితీరుపై ఎఫ్డీఏ అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే.
పాశమైలారంలోని నాలుగో యూనిట్లో ఎఫ్డీఏ దర్యాప్తు అధికారుల టీమ్ ఈ నెల 4–13 తేదీల్లో తనిఖీలు చేసింది. ఇక్కడి లోపాలను వివరిస్తూ అరబిందోకు ఫామ్ 483ని పంపించింది. దీని ప్రకారం కంపెనీ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇక్కడి ల్యాబొరేటరీ టెస్టులపైనా ఎఫ్డీఏ అసంతృప్తి ప్రకటించింది. పాశమైలారంలోని నాలుగో యూనిట్ ఇంజెక్షన్ల తయారీకి కీలకమైనది.