దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన యూత్ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’. భూమిక కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంతో విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా పరిచయం అయ్యాడు. నీలిమ గుణ నిర్మించారు. ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ ‘అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ ఉషా కిరణ్ మూవీస్ సంస్థతోనే ప్రారంభమైంది. రామోజీ రావు గారు నాకు చాలా ఇన్స్పిరేషన్.
కథా చర్చల్లో ఆయన నా అభిప్రాయం కూడా అడిగేవారు. అది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సంస్థ నాకు మంచి పునాది వేసింది. అదే సంస్థ నా ‘రుద్రమదేవి’ సినిమాను తీసుకుంది. ఇప్పుడు ‘యుఫోరియా’ కూడా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కావడం చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు. విఘ్నేష్ గవిరెడ్డి, నిర్మాతలు నీలిమ, రాగిణి, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి పాల్గొన్నారు.
