
లండన్: కరోనా మహమ్మారి అంతం యూరప్ లో మొదలవుతుందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. తమ రీజియన్ లో మహమ్మారి అంతం మొదలవుతుందని డబ్ల్యూహెచ్ వో యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగ్ తెలిపారు. అయితే మార్చి ఆఖరుకల్లా యూరప్ లో 60 శాతం మంది ఒమిక్రాన్ బారినపడొచ్చని అంచనా వేశారు. ఎక్కువ మంది వైరస్ బారినపడడం, మరోవైపు భారీగా వ్యాక్సినేషన్ జరగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని అన్నారు. ఈ ఏడాది చివరి కల్లా కరోనా అంతమయ్యే చాన్స్ ఉందన్నారు. అయితే కొవిడ్ ఎండమిక్గా మారిపోతుందని చాలా అంచానలు సాగుతున్నాయని, కానీ ఇప్పటికిప్పుడు ఒక నిర్ధారణకు రావడం కష్టమని చెప్పారు. గతంలో ఎండమిక్గా భావించిన ప్రతిసారీ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని, ఒమిక్రాన్ అంతం తర్వాత కూడా మరో వేరియంట్ రాదని చెప్పలేమన్నారు. దీనిన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని క్లూగ్ సూచించారు.