- ప్లాంటును సందర్శించిన పోలండ్ రాయబారి
హైదరాబాద్, వెలుగు: యూరప్లోని పలు దేశాల రైల్వే కంపెనీలకు విడిభాగాలు తయారు చేసి ఇచ్చే పొల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. మెదక్లోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో దీనికి ఫెసిలిటీలు ఉన్నాయి. మనదేశంలో పోలండ్ రాయబారి, చార్జ్ డీ ఎఫైర్స్ డాక్టర్ సెబాస్టియన్ డొమ్జల్స్కీ ఈ ప్లాంటును గురువారం సందర్శించారు.
ఆయనతో పాటు పోలండ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెగ్జాండర్ దండా, పోలండ్ రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్రజైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కూడా ఉన్నారు. ఇప్పుడున్న ప్లాంటుతో పాటు నిర్మాణంలో ఉన్న రెండో ప్లాంటునూ ఈ బృందం సందర్శించింది. భారతదేశంలో ఒక పోలండ్ కంపెనీ సాధించిన వృద్ధిని డొమ్జల్స్కీ ప్రశంసించారు. భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు పొల్మోర్ స్టీల్ను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ, విస్తరణకు మరో మూడు ఎకరాల భూమి, 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కేటాయించామని ప్రకటించారు. మరో వందమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఐఐసీలతోపాటు, వివిధ వర్గాల నుంచి ఆశించిన మద్దతు వస్తోందని ఆయన వివరించారు.