ఇతను మాట్లాడలేడు. కానీ మాట్లాడతాడు. తను చెప్పాలనుకున్న విషయం తన చేతిలోని ఉలి, సుత్తికి తెలుస్తుంది. వినపడదు. కానీ, అందంగా చెక్కిన బొమ్మలు చెప్పే ముచ్చట్లు అర్థమవుతాయి. ప్రాణం లేని కలపను అందంగా చెక్కి ప్రాణం పోస్తున్నాడు కశ్మీర్కు చెందిన అరవై ఏండ్ల మహమ్మద్ యూసఫ్ మురాన్.
యూసఫ్ సొంతూరు శ్రీనగర్. పుట్టినప్పటినుంచే మూగ, చెవిటి. ఎప్పుడూ ఎవరో ఒకరు యూసఫ్ డిజబిలిటీని చూపిస్తూ ఎగతాళి చేసేవాళ్లు. అయినా, అవేవి పట్టించుకోలేదు. వాళ్ల తాతలనుంచి వారసత్వంగా వచ్చిన శిల్ప కళ నేర్చుకున్నాడు. చెక్క మీద శిల్పాలు చెక్కుతూ అందులోనే మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు యూసఫ్.
వ్యవసాయం వదిలి...
కొన్నేండ్ల క్రితంవరకు వ్యవసాయం చేసేవాడు యూసఫ్. అయితే, అందులో రైతుల కన్నా దళారులే ఎక్కువ లాభ పడుతున్నారని తెలుసుకొని తన అన్న అబ్దుల్ అహద్ మురాన్తో కలిసి చెక్క మీద శిల్పాలు చెక్కి అమ్మడం మొదలుపెట్టాడు. మెమొంటోలు, జంతువులతో పాటు మనుషుల బొమ్మలు, ఇతర కళాకండాలు చెక్కుతూ వాటిలో కశ్మీర్ కల్చర్ని చూపిస్తాడు.
వాల్నట్ లేదా దేవదారు కలప మాత్రమే వాడతాడు. ఎక్కువ శాతం ఒకే చెక్క మీద పూర్తి బొమ్మ చెక్కడం ఈయన ప్రత్యేకత. అంతేకాకుండా, ఎలాంటి మెషిన్ సాయం తీసుకోకుండా ఉలి, సుత్తితోనే శిల్పాలు చెక్కుతుంటాడు. రోజూ 8 గంటలు కష్టపడినా... ఒక శిల్పాన్ని పూర్తిగా చెక్కడానికి దాదాపు మూడు వారాల టైం పడుతుంది. అంత టైం ఎందుకు పడుతుందంటే.. చెక్కుతున్నప్పుడు శిల్పాన్ని కొంచెం తప్పు చెక్కినా దాన్ని వదిలేసి మళ్లీ కొత్తగా మొదలుపెడతాడు. అందుకే ‘యూసఫ్ శిల్పాల్లో ఏ చిన్న తప్పును కూడా గుర్తించలేం’ అంటుంటారు చాలామంది. మనదేశంలోనే కాకుండా అరబ్, యూరప్ దేశాల వాళ్లు కూడా యూసఫ్ చెక్కిన శిల్పాలు కొంటుంటారు. నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. గుర్రంపైన కూర్చొని డ్రాగన్ను చంపుతున్న సెయింట్ జార్జ్ ఆఫ్ లిడ్డా అనే శిల్పం ఆరున్నర లక్షల రూపాయలకు, హుక్కా తాగుతున్నట్టు ఉన్న ట్రెడిషనల్ శిల్పం 80,000 రూపాయలకు ఈ మధ్యే అమ్ముడుపోయాయి.
‘రెండు వందల ఏండ్లనాటిది ఈ కళ. దాంట్లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్కరు ఇలాంటి కళల్ని ప్రోత్సహించాలి. అవి మన దేశ కల్చర్కి అద్దం పడతాయి’ అని చెప్పాడు మహమ్మద్ యూసఫ్ మురాన్.