
ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారత మహిళ బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ. మహిళలంటే ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం గౌరవం లేదన్న ఆమె… వారిని దూరం పెట్టాలన్నారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. కుల్దీప్సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద, గోపాల్ కందా.. వీరందరూ మహిళలను వేధించిన వారేనన్నారు.ఇలాంటి వారిని వారిని బహిష్కరించాలని మహిళల కోరారు ప్రియాంక గాంధీ.
ఉన్నావో బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ అరెస్టయ్యాక ఆయనను బీజేపీ సస్పెండ్ చేసిందన్నారు. ఆ తర్వాత స్వామి చిన్మయానంద కూడా ఓ న్యాయ విద్యార్థినిని లైంగికంగా వేధించి అరెస్టయ్యారని తెలిపారు.
ఆ తర్వాత 2012లో తన విమానయాన సంస్థలో పనిచేసిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమన్న ఆరోపణలు వచ్చాయని ప్రియాంక అన్నారు. కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పడు అదే గోపాల్ కందా మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ప్రియాంకగాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.