- కేరళ కేబినెట్లో సీఎం తప్ప అందరూ కొత్తవారే
- కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోని విజయన్
తిరువనంతపురం: కేరళలో రెండోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పినరయి విజయన్ కేబినెట్ కూర్పులో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతా కొత్త వారినే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. గత టర్మ్లో హెల్త్ మినిస్టర్గా.. నిఫా వైరస్ మొదలు కరోనా క్రైసిస్ను సమర్థవంతంగా హ్యాండిల్ చేసి ఇతర రాష్ట్రాలకు కేరళను ఆదర్శంగా నిలిపి కరోనా చాంపియన్గా గుర్తింపు పొందిన కేకే శైలజకు సైతం మంత్రి పదవి ఇవ్వకుండా దూరంగాపెట్టడం అందరిని షాక్కు గురిచేసింది. ఆమెను కొత్త కేబినెట్లోకి తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు సైతం ఎల్డీఎఫ్ సర్కార్పై విమర్శలు చేస్తున్నాయి. శైలజ విషయంలో సీఎం విజయన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ తప్పుపట్టారు. ఆమెకున్న పేరు, సామర్థ్యాలను పక్కన పెడితే, హెల్త్ మినిస్టర్గా ఆమె పనితీరు అద్భుతం అని ట్విట్టర్లో కొనియాడారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్ను కట్టడి చేయడంలో శైలజా టీచర్ కీలక పాత్ర పోషించడంతో ఆమె ‘రాక్స్టార్’ హెల్త్ మినిస్టర్గా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా గత సెప్టెంబర్లో యూకేకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజీన్ కేకే శైలజాను ‘టాప్ థింకర్ ఆప్ ది ఇయర్-2020’గా సెలెక్ట్ చేసింది. తాజా ఎన్నికల్లో ఆమె 60 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.
కొత్త ముఖాలు కావాలి.. అందుకే..
కేరళ సీఎం విజయన్ మంగళవారం ఆ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎన్నుకున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ సీనియర్ లీడర్ ఎలమారామ్ కరీం అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో పార్టీ విప్ పదవిని కేకే శైలజకు అప్పగించాలని నిర్ణయించారు. ‘సీఎం విజయన్ తప్ప కేబినెట్లో అందరూ కొత్తవారే. ఇది మా పార్టీ నిర్ణయం. అలా చేసే ధైర్యం ఒక్క మా పార్టీకే ఉంది. చాలా మంది సీనియర్ లీడర్లనే ఈ ఎన్నికల్లో పోటీకి అనుమతించలేదు. మాకు కొత్త ముఖాలు కావాలి’ అని ఎమ్మెల్యే షంషీర్ అన్నారు. సీఎం సహా 21 మందితో విజయన్ కేబినెట్ ఏర్పాటు చేసి వారి పేర్లను ప్రకటించారు. సీపీఎం నుంచి మంత్రులుగా విజయన్ అల్లుడు మొహద్ రియాస్, ఎంవీ గోవిందన్, కె.రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పి.రాజీవ్, వీఎన్.వసాన్, సాజీ చెరియన్, వి.శివన్కుట్టి, డాక్టర్ఆర్.బింధు, వీణా జార్జ్, వి.అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు.