- పక్కా స్కెచ్తో సికింద్రాబాద్లో విధ్వంసం చేయించిన ఆవుల సుబ్బారావు
- ప్లాన్ అమలయ్యాక జంప్.. వాట్సాప్ గ్రూప్లు డిలీట్
- అగ్నిపథ్తో అకాడమీలు ఆగమవుతాయని కుట్ర
- రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంలో కీలక సూత్రధారి ఆవుల సుబ్బారావు (47)కు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో రైల్వే ఎస్పీ అనురాధ పలు కీలక విషయాలు ప్రస్తావించారు. విధ్వంసానికి ముందు రోజు సుబ్బారావు హైదరాబాద్లోనే ఓ లాడ్జిలో మకాం వేసి.. విధ్వంసాన్ని మానిటర్ చేశాడని రిపోర్టులో పేర్కొన్నారు. అగ్నిపథ్ వల్ల తన అకాడమీలకు నష్టం వాటిల్లుతుందనే పలు అకాడమీలతో కలిసి కుట్రకు సుబ్బారావు ప్లాన్ చేశాడు. ఆవుల సుబ్బారావుతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న లక్ష్మాపురానికి చెందిన దూబల మల్లారెడ్డి (24), వలిగొండ మండలం గోకారానికి చెందిన రాధరపు శివకుమార్(22), జోగులాంబ గద్వాల జిల్లా జులకల్ గ్రామానికి చెందిన నాయక బీసీరెడ్డి (23)ని పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బోయిగూడలోని రైల్వేకోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ నలుగురికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావును 64వ నిందితుడిగా చేర్చారు.
జాబ్ గ్యారంటీ పేరిట అకాడమీ పెట్టి..!
ఏపీ నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేశాడు. పదేండ్లు సర్వీస్ చేసి 2011లో రిటైర్ అయ్యాడు. తర్వాత 2014లో గుంటూరు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేశాడు. ఆర్మీ ర్యాలీలు జరిగే ప్రాంతానికి వెళ్లి అభ్యర్థుల సమాచారం తీసుకునేవాడు. జాబ్ గ్యారంటీ పేరుతో ట్రైనింగ్ ఇస్తానని చెప్పేవాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల నుంచి 3 లక్షల వసూలు చేసేవాడు. ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్, బాండ్ పేపర్స్ తన వద్ద డిపాజిట్ చేసుకొని.. సెలెక్షన్ తర్వాత డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. తెలంగాణలోని బోడుప్పల్లోనూ సాయి డిఫెన్స్ అకాడమీ బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే గత నెల 14న కేంద్రం అగ్నిపథ్ స్కీమ్ను ప్రకటించగా.. ఈ స్కీమ్ వల్ల తన అకాడమీలకు నష్టం వాటిల్లుతుందని భావించాడు. దీంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్కీమ్ను క్యాన్సిల్ చేయించాలని వివిధ అకాడమీలు, అభ్యర్థులతో కలిసి ఆందోళనలకు ప్లాన్ చేశాడు.
పాత స్టూడెంట్స్ను కూడా రప్పించి..
సికింద్రాబాద్లో విధ్వంసానికి ముందు రోజు(జూన్16న) సుబ్బారావు హైదరాబాద్ వచ్చాడు. బోడుప్పల్లోని ఎస్వీఎం లాడ్జిలో షెల్టర్ తీసుకున్నాడు. స్థానికంగా ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీలో పనిచేస్తున్న దూబల మల్లారెడ్డి, రాధరపు శివకుమార్, బీసీరెడ్డితో ప్లాన్ గురించి చర్చించాడు. ఆందోళనకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయించాడు. పాత స్టూడెంట్స్ను కూడా సికింద్రాబాద్ రప్పించాలని నిర్ణయించి ప్లాన్ అమలు చేశాడు. ఖర్చుల కోసం అని రూ.35 వేలు ఇచ్చాడు. ఆందోళనలకు సంబంధించి అకాడమీకి చెందిన ఉద్యోగి భరత్ అలియాస్ రెడ్డప్పతో బ్యానర్స్ ప్రింట్ చేయించాడు. జూన్17న ఉదయం 8.30కు రైల్వేస్టేషన్లోకి అభ్యర్థులు దూసుకెళ్లి ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో మల్లారెడ్డి, శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. విధ్వంసాన్ని అంతా బోడుప్పల్లోని ఎస్వీఎం లాడ్జి నుంచే సుబ్బారావు మానిటర్ చేశాడు. టీవీల్లో టెలికాస్ట్ అవుతున్న విధ్వంసం వీడియోలు చూశాడు.
విధ్వంసానికి వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు
‘హకీంపేట్ సోల్జర్స్’ వాట్సాప్ గ్రూప్లో జూన్ 17న సికింద్రాబాద్ ఏఆర్వో ఆఫీస్ వద్దకు అందరూ చేరుకోవాలని సుబ్బారావుతో పాటు అతడి అనుచరులు పోస్టింగ్స్ చేశారు. ఈ గ్రూప్ను గతంలో సుబ్బారావే క్రియేట్ చేయించాడు. రైల్వేస్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, చలో సికింద్రాబాద్ ఏఆర్వో సహా తదితర గ్రూపుల్లోనూ యాక్షన్ ప్లాన్పై అంతా చర్చించుకున్నారు. బీహార్ తరహాలోనే సికింద్రాబాద్లో విధ్వంసం చేయాలని డిస్కషన్ చేసుకు న్నారు. బోగీలకు నిప్పుపెట్టాలని నిర్ణయించుకున్నారు.
సాక్ష్యాలు మాయం, ఎస్కేపింగ్ ప్లాన్
అనుకున్న దానికంటే ఎక్కువ తీవ్రత, దేశస్థాయిలో కలకలం సృష్టించడంలో సక్సెస్ అయ్యామని సుబ్బారావు అనుకున్నాడు. ఆ తర్వాత మల్లారెడ్డి, శివకుమార్, బీసీ రెడ్డిని అలర్ట్ చేశాడు. పోలీసులకు చిక్కకుండా అన్ని వాట్సాప్ గ్రూపులను డిలీట్ చేసి గ్రూపుల్లో నుంచి ఎగ్జిట్ కావాలని చెప్పాడు. ఆ విధ్వంసం జరిగిన రోజే సుబ్బారావు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాడు. సాక్ష్యాలు లభించకుండా తప్పించుకునేందుకు నిందితుడు ప్లాన్ చేశాడని రైల్వే ఎస్పీ అనురాధ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు.