
ఏవీ సుబ్బారెడ్డి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. బెయిల్ కు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొని ఆమె తరపు న్యాయవాదులు నంద్యాల వెళ్లారు. సాయంత్రం ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
మే 17న అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను మే 17న నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డిపై మే 16 రాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూమా అఖిలప్రియ ఆరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎఫ్ఐఆర్ నెంబర్ 98/2023
తెలుగుదేశం నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియను 14 రోజులు రిమాండ్ తరలించారు. ఏవి సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో నంద్యాల తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 98/2023గా సెక్షన్లు 324, 307, 120b, ఆర్డబ్ల్యు 34 ఐపిసిగా నమోదైన కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు, సాయి, మోహన్లను కర్నూలు జిల్లా జైలుకు 14 రోజుల రిమాండ్కు పంపినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. భూమా అఖిలప్రియ తరఫున తాతిరెడ్డి తులసిరెడ్డి, ఆళ్లగడ్డ శివరామిరెడ్డి, ప్రాస్క్యూస్షన్ తరపున పబ్లిక్ ప్రాస్క్యూటరు వాదనలు వినిపించారు. ఈ వాదనలు దాదాపు గంట సేపు జరిగాయి. వాదనల అనంతరం మేజిస్ట్రేట్ కర్నూలు జిల్లా జైలుకు పంపించారు.
నంద్యాల టీడీపీలో వర్గపోరు
నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.