- ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి బుధవారం కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు ఆయన ఏకవాక్యంతో రాజీనామా లేఖను బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డికి పంపించారు. భారమైన హృదయంతో తాను బీజేపీని వీడుతున్నట్లు, ఇన్నాళ్లూ తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
రాహుల్తో అరగంటపాటు భేటీ
వివేక్ తన కుటుంబంతో కలిసి శంషాబాద్లోని నోవాటెల్కు వెళ్లి అక్కడ రాహుల్గాంధీతో సమావేశమయ్యారు. అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కృష్ణకు రాహుల్ గాంధీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అంతకముందు వివేక్కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా కోరారు. కాంగ్రెస్లో చేరిన అనంతరం వివేక్, ఆయన భార్య సరోజ, కుమారుడు వంశీకృష్ణ ట్యాంక్బండ్ వద్ద గల కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.