మహారాష్ట్ర మద్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు

మహారాష్ట్ర మద్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు
  • పక్క రాష్ట్రం నుంచి తెలంగాణలోకి రాకుండా చర్యలు
  • శాఖ డైరెక్టర్​ ముషారఫ్​ ఆలీ ఫారూఖి ఆదేశాలతో ముమ్మర తనిఖీలు
  • నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ముందస్తు చర్యలు

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి మద్యం ఇటు రాకుండా ఎక్సైజ్ ​శాఖ చర్యలు చేపడుతోంది. ఆ శాఖ డైరెక్టర్ ​ముషారఫ్​ఆలీ ఫారూఖి నిర్మల్ ​జిల్లాపై స్పెషల్ ​ఫోకస్​ పెట్టినట్లు తెలిసింది. సదరు ఆఫీసర్ ఇక్కడ జిల్లా కలెక్టర్​గా పని చేసిన అనుభవం, ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దృష్టి ​పెట్టారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వెహికిల్​ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గతంలో దేశీదారు ఏరులై పారగా.. ఎక్సైజ్ ​శాఖ తీసుకుంటున్న చర్యలతో కొద్ది నెలలుగా అక్రమ రవాణాకు బ్రేక్ ​పడింది. అయితే, తెలంగాణలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో కొందరు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. దేశీదారు కాకుండా లిక్కర్​ బాటిళ్లను తీసుకొచ్చి అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఫలితంగా నిర్మల్​జిల్లాలో మద్యం విక్రయాలు తగ్గిపోతుండడాన్ని గుర్తించిన ఆ శాఖ రంగంలోకి దిగింది.

నిత్యం తనిఖీలు

జిల్లాలోని బాసర, ముథోల్, తానూర్, కుభీర్, కుంటాల, సారంగపూర్​ మండలాలు మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లాకు సరిహద్దులో ఉన్నాయి. కాగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో చెక్​పోస్టులు పెట్టి నిత్యం​తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే తానూర్​ మండలం బెల్​తరోడ అంతర్రాష్ట్ర చెక్​పోస్టు, కుభీర్ ​మండలం సిర్​పెల్లి వద్ద, సారంగపూర్​ మండలం స్వర్ణ వద్ద చెక్​పోస్టులు పెట్టి పోలీసు శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు కొద్ది రోజులుగా ఈ తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 14 రూట్లుగా విభజించి ఒక్కో టీంలో ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఆ రాష్ట్రంలోని వైన్సుల్లో నుంచి మద్యం తీసుకువచ్చేవారిపై నిఘా పెట్టి తెలంగాణలోకి ఎంట్రీ కాగానే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఎలక్షన్​ ముగిసేంతవరకు..

రాష్ట్రంలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు​ జరగనున్నాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తుంటారు. అయితే, ఎన్నికల కోడ్​ టైంలో సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చే వీలుండదు. దీంతో అక్రమార్కులు ఇప్పటి నుంచే మద్యాన్ని డంప్​ చేసుకునే అవకాశముందని గుర్తించిన ఎక్సైజ్​శాఖ ముందస్తుగానే తనిఖీలు చేపట్టిన్నట్లు తెలుస్తోంది. సరిహద్దు చెక్​పోస్టులే కాకుండా గ్రామాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. కొన్ని చోట్ల అకస్మాతుగా తనిఖీలు చేస్తున్నారు. ఫలితంగా ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే పలువురిపై కేసులు నమోదయ్యాయి. డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్​ ఉండటంతో కింది స్థాయి అధికారులు యాక్టివ్​గా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. 

క్రిమినల్​ కేసులే

మహారాష్ట్ర నుంచి మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం. చెక్​పోస్టుల వద్ద ప్రతి వెహికల్​ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నాం. అక్రమంగా మద్యాన్ని తరలిస్తే క్రిమినల్​కేసులు నమోదు చేస్తాం.

 శ్రీనివాస్​రెడ్డి, అసిస్టెంట్​కమిషనర్, నిర్మల్​ ఫొటోరైటప్​