
మహబూబ్నగర్, వెలుగు: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి షర్మిల చెడ్డ పేరు తెస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కాలేజీని మంత్రి ప్రారంభించారు. తర్వాత కౌకుంట్ల మండల కేంద్రానికి వెళ్లి తహసీల్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ‘‘వైఎస్ షర్మిల ఎవరంటే.. అందరూ వైఎస్సార్ కూతురు అంటారు. ఆమె మాటలను చూసి, వైఎస్సార్ బిడ్డ ఇట్ల మాట్లాడుతుందేంటని అడుగుతున్నరు.
ఎమ్మెల్యేలు, మంత్రులను చెప్పుతో కొడతానని, మొగోనివా? అంటూ మాట్లాడుతున్నది. ఇలా మాట్లాడితే వైఎస్సార్కే చెడ్డ పేరు వస్తది. ఇలా మాట్లాడితే తెలంగాణలో నడవదు. ఇక్కడి ప్రజలు ఆత్మాభిమానంతో బతుకుతారని ఆమె కుటుంబ సభ్యులే షర్మిలకు చెప్పాలి”అని శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలా మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తే ప్రజలు సహిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించిన అంశంపై మాత్రమే విమర్శలు చేశామని, వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.