
ఆంధ్ర- తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆందోళన ఉదృతం అవుతుంది. రెంటల్ బేసిస్లో షోలు ప్రదర్శించలేమని, పర్సంటేజ్ విధానంలో అయితేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు నడిపిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పడంతో చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకి మధ్య వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో నేడు మే21న ఫిలిం ఛాంబర్ పెద్దలతో ఎగ్జిబిటర్లు జరిపిన భేటీ ముగిసింది. ఈ భేటీలో నిర్మాతలు-ఎగ్జిబిటర్లు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. థియేటర్లలో సింగిల్ స్క్రీన్ల వల్ల వచ్చే నష్టాలను చెప్పుకొచ్చారు ఎగ్జిబిటర్లు. నిర్మాతలతో మాట్లాడి లాభాల్లో వాటా ఇప్పించాలని ఫిలిం ఛాంబర్ పెద్దలను విన్నవించుకుంటున్నారు.
నేడు సినీ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, నాగ వంశీ, రవి తదితరులతో ఫిల్మ్ ఛాంబర్ భేటీ అయింది. మే24 లోపు పూర్తిస్థాయిలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య భేటీ ఉండనుందని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. అయితే, ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్టే ఫస్ట్ వీక్ లాభాల్లో వాటాని కేటాయిస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఎగ్జిబిటర్ల డిమాండ్ను నిర్మాతలు ఏ విధంగా స్వాగతిస్తారనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్ల బంద్ ఎంత వరకు కరెక్ట్ అనే వాదన మరో పక్క వినిపిస్తోంది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె విధానంలో సినిమాలను ప్రదర్శించలేమని, మల్టీప్లెక్స్లకు చెల్లించినట్లు పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానించిన విషయం తెలిసిందే.