నకిలీ మందులతో జాగ్రత్త!
హైదరాబాద్, వెలుగు : కొన్ని వెబ్సైట్లు భారీ డిస్కౌంట్లతో ఫార్మా ప్రొడక్టులను అమ్ముతున్నాయని, ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ రంగంలోని ఎక్స్పర్టులు సూచిస్తున్నారు. కస్టడీ ట్రాకింగ్, తగిన పర్యవేక్షణ లేకుండా రవాణా అయ్యే మెడికల్ ప్రొడక్టుల వల్ల హాని జరుగుతుందని అన్నారు. ‘‘అక్రమంగా వ్యాపారం చేసే వాళ్లు మందులను తగిన టెంపరేచర్లో నిల్వ చేయరు. రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా మందుల సామర్థ్యం తగ్గవచ్చు. హాని జరిగే అవకాశాలూ ఉంటాయి. ఈ–-కామర్స్ వచ్చాక అక్రమ వ్యాపారాలను అరికట్టడం సమస్యగా మారుతోంది. భారతీయ ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసిన అసలైన మందులు సోమాలియా, జిబౌటి, యెమెన్ వంటి పలు దేశాలకు అక్రమ మార్గాల ద్వారా వెళ్తున్నాయి’’అని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) పేర్కొంది.
సంస్థ డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయమై మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ఎగుమతిదారులు డ్రగ్ సప్లై చెయిన్, ఎగుమతి చేసే దేశాల ఫార్మా కంపెనీల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంచనా ప్రకారం ప్రపంచ ఫార్మా వాణిజ్యంలో 1.3– 4.2 శాతం అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయి.