ఏఐ టూల్స్ వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం, డేటా విశ్లేషణ.. లాంటి పనులు చేయడం సులభమైంది. కానీ ఈ వెసులుబాటు వల్ల ఆలోచనా సామర్థ్యం తగ్గుతుందని ఈ యేడు వచ్చిన స్టడీల్లో తేలింది. ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల మెదడులో ఆలోచనా ప్రక్రియలకు సంబంధించిన భాగాల పనితనం తగ్గుతుందని, క్రిటికల్ థింకింగ్ బలహీనపడుతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఎంఐటీ రీసెర్చ్..
గతంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ) పరిశోధకులు చేసిన రీసెర్చ్లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. కొందరు చాట్జీపీటీ సాయంతో వ్యాసాలు రాసినప్పుడు వాళ్ల మెదడులో థింకింగ్ నెట్వర్క్ల యాక్టివ్నెస్ తగ్గింది. ఏఐ సాయం తీసుకోకుండా రాసినవారితో పోల్చితే ఏఐ వాడినవాళ్లు తమ వ్యాసాల్లోని కంటెంట్ను తక్కువగా గుర్తుంచు కున్నారు.
కార్నెగీ మెల్లన్, మైక్రోసాఫ్ట్ స్టడీ
కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్ కలిసి చేసిన ఒక స్టడీలో కూడా ఏఐ వల్ల క్రిటికల్ థింకింగ్ తగ్గుతోందని తేలింది. ఈ స్టడీలో 319 మంది ఉద్యోగుల పనితీరుని పరిశీలించారు. వాళ్లు వారానికి కనీసం ఒకసారి ఏఐని ఉపయోగిస్తున్నారు. ఏఐ మీదున్న నమ్మకంతో వాళ్లు పనిలో తక్కువ ఎఫర్ట్ పెడుతున్నారని తేలింది.
పిల్లలపై ప్రభావం
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అక్టోబర్లో స్కూల్ స్టూడెంట్స్ మీద ఏఐ ప్రభావం ఎలా ఉందనే అంశంపై రీసెర్చ్ చేసింది. ఏఐ వల్ల ప్రతి పదిమందిలో ఆరుగురి స్కిల్స్పై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని తేలింది. అయితే, ఏఐని సరిగ్గా వాడుకుంటే స్టూడెంట్స్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టూల్స్ని వాడే యాక్టివ్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతున్నాం. కానీ.. అవసరమైతేనే ఏఐని వాడాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.
