- రూ.4,26,000 కోట్లు లూటీ చేసిన ప్రబుద్ధులు
- యూరోప్లో చాలా దేశాలే వారి టార్గెట్
- ఈ స్కామ్ సూత్రధారులు మార్టిన్ షీల్డ్స్, పౌల్ మోరా
- వీళ్ల దారిలో 2 బిలియన్ డాలర్లు కొట్టేసిన భారత మూలాలున్న ఇంకో వ్యక్తి
వెలుగు, బిజినెస్ డెస్క్: వెలుగు, బిజినెస్ డెస్క్: అమెరికాకు చెందిన జోర్డన్ బెల్ఫోర్ట్ గురించి చాలా మంది వినే ఉంటారు. తప్పుడు సమాచారంతో పెన్నీ స్టాకులను(మైక్రో క్యాప్ స్టాకులు) ఇన్వెస్టర్లతో కొనేటట్టు చేసి బిలియన్ల డాలర్లను వెనకేసుకున్నాడు. అమెరికా స్టాక్ మార్కెట్లో ఈ పెన్నీ స్టాక్ స్కామ్ ఒక సంచలనం. ఇలాంటిదే ఇటీవల యూరోప్లో కూడా ఓ ఫైనాన్షియల్ మోసం వెలుగు చూస్తోంది. దీనిని విశ్లేషకులు ఏకంగా గత వందేళ్లలో అతి పెద్ద స్కామ్ అని అంటున్నారు. యూరోప్ హిస్టరిలోనే అతి పెద్ద ట్యాక్స్ దోపిడీగా పిలుస్తున్నారు. కమ్–ఎక్స్ ట్రేడ్తో ఒకే బాస్కెట్ స్టాక్స్పై రెండు సార్లు ట్యాక్స్ రిఫండ్ను పొంది, యూరోపియన్ దేశాల ఖజానాలను ఖాళీ చేసేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఈ స్కామ్కు సూత్రధారులు బ్రిటన్ వ్యక్తి మార్టిన్ షీల్డ్స్, స్విట్జర్లాండ్ వ్యక్తి పౌల్ మోరాలైతే, పాత్రధారులలో ఆయా దేశాలలోని వందలాది బ్యాంకర్లు, లాయర్లు, ఇన్వెస్టర్లూ ఉన్నారు. వీళ్లంతా కలిసి 2006 నుంచి 2011 మధ్య కాలంలో యూరోపియన్ మార్కెట్లలో రూ.4,26,000 కోట్ల ఫ్రాడ్కు పాల్పడ్డారు. మెరిల్ లించ్ లండన్ ఆఫీస్లో కలుసుకున్న మార్టిన్, పౌల్లు ఇద్దరూ, కమ్ –ఎక్స్ ట్రేడింగ్ స్కీమ్ను మొదలెట్టారు. ఈ ట్రేడింగ్ ద్వారా ఇన్వెస్టర్లు డబుల్ ట్యాక్సేషన్ నుంచి తప్పించుకుంటారు. ఇదే ప్రాసెస్ను మళ్లీ మళ్లీ చేసి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ రీబేట్లను క్లయిమ్ చేసి యూరోపియన్ దేశాల ఖాజానాకు గండి కొట్టారు. ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ వలన యూరోప్లోని జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఎక్కువగా నష్టపోయాయి. 2006 నుంచి 2011 మధ్య కాలంలో జర్మనీ ట్యాక్స్ల రూపేణా రూ. 2,13,000 కోట్లను నష్టపోగా, ఫ్రాన్స్ రూ.1,20,000 కోట్లను కోల్పోయింది. ఈ దేశాలే కాకుండా స్పెయిన్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రీయా, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా కొంత మొత్తంలో నష్టపోయాయి.
ఎవరీ మార్టిన్ షీల్డ్స్?
జర్మన్ ప్రాసెక్యూటర్లు షీల్డ్, మోరాపై చార్జ్ షీట్లను నమోదు చేశారు. జర్మనీ ట్రెజరీకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగవేశారని కేసు వేశారు. ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్లో మరో 400 మంది వ్యక్తులపై, 56 కేసులు నమోదు చేశారు. ఈ స్కామ్కు మెరిల్ లించ్ లండన్ బ్రాంచ్లోనే బీజం పడింది. క్లయింట్లకు తక్కువ ట్యాక్స్ పడేట్టు మార్గాలను కనుక్కోవడమే షీల్డ్స్ ఉద్యోగం. ఇక్కడే ఆయన క్లయింట్ల కోసం ‘డివిడెండ్ అర్బిట్రేజ్’ను గుర్తించారు. 2004 లో మెరిల్ లించ్ నుంచి బయటకు వచ్చేసే ముందు ఆయన ఈ కమ్–ఎక్స్ ట్రేడింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు.
కమ్–ఎక్స్ ట్రేడింగ్ అంటే?
కమ్–ఎక్స్ ట్రేడింగ్ అంటే డివిడెండ్ను బేస్ చేసుకుని సాగించే మోసం. షేర్హోల్డర్స్కు కంపెనీలు డివిడెండ్ చెల్లించే ముందు షేర్లను ఆప్షన్ ట్రేడింగ్లో కొనుగోలు చేస్తారు. డివిడెండ్ చెల్లించిన తర్వాత అదే షేర్లను అమ్మేస్తారు. డివిడెండ్ చెల్లించక ముందున్న షేరు ధర, డివిడెండ్ చెల్లించాక తగ్గడం మామూలే. దీంతో ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్ తగ్గడంతో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈ ట్రేడింగ్ ద్వారా మోసానికి పాల్పడాలనుకునే ట్రేడర్లు పెద్ద కంపెనీకి చెందిన షేర్లను అప్పుగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. దీంతో ట్యాక్స్ అథారిటీలకు షేర్లపై ఓనర్లు ఇద్దరిగా కనిపిస్తారు. కానీ నిజానికి అక్కడ ఒక్క ఇన్వెస్టరే ఓనర్గా ఉంటారు. స్టాక్ బ్రోకింగ్ చేసే బ్యాంకులు ఇన్వెస్టర్ ట్యాక్స్ కట్టారని కన్ఫర్మ్ చేస్తాయి. దీంతో అవే షేర్లపై ఇద్దరు ఇన్వెస్టర్లు ట్యాక్స్ రిబేట్ను క్లయిమ్ చేస్తారన్నమాట.
సంజయ్ షా కూడా ఇదే చేశాడు
ఈ పద్దతిని కాపీ చేసి డెన్మార్క్ ట్రెజరీ నుంచి రూ. 14,200 కోట్లు కాజేశాడని బ్రిటిష్ సిటిజన్ సంజయ్ షాపై ఆరోపణలున్నాయి. ఆయన కుటుంబం కెన్యా నుంచి బ్రిటన్కు వలస వచ్చింది. ఆయన పూర్వీకులు ఇండియా మూలాలున్న వారు. ఎంట్రప్రెనూర్గా తనకు తాను చెప్పుకుంటున్న షా ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. తాను ఏ మోసం చేయలేదని షా ఖండిస్తున్నప్పటికీ, ఆరోపణలైతే బలంగా ఉన్నాయి. ఇంకో గమ్మత్తేమంటే, కొన్నేళ్ల కిందట తాను కొన్న రూ. 9.23 కోట్ల విలువైన యాట్కు కమ్ –ఎక్స్ అని పేరు పెట్టడం అనేక అనుమానాలకు దారి ఇస్తోంది.1992 లోనే చదువు మానేసి, కాలేజ్ నుంచి బైటపడి, అనేక ఫైనాన్షియల్ సంస్థలలో పనిచేశాడు. 2007 లో లండన్లోని రాబో బ్యాంక్ లో డివిడెండ్ ఆర్బిట్రేజ్ డెస్క్లో పనిచేశాడు. అక్కడే కమ్–ఎక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాడు.