
- గత నెల వీటి విలువ 37.24 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: రెండు నెలల తగ్గుదల తరువాత, భారతదేశ ఎగుమతులు జులైలో 7.29 శాతం పెరిగి 37.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే నెలలో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్టమైన 27.35 బిలియన్ డాలర్లకు విస్తరించింది. గురువారం విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, ఈ ఏడాది జులైలో దిగుమతులు సంవత్సరానికి 8.6 శాతం పెరిగి 64.59 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు జులైలో 27.35 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
ఇది గత సంవత్సరం నవంబర్లో వాణిజ్య లోటు 31.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాక ఇదే అత్యధికం. 2025-–26 ఏప్రిల్–-జులై కాలంలో ఎగుమతులు 3.07 శాతం పెరిగి 149.2 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.36 శాతం పెరిగి 244.01 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2025–-26 మొదటి నాలుగు నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ విషయమై కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారతదేశ వస్తువుల, సేవల ఎగుమతులు బాగా రాణిస్తున్నాయని చెప్పారు. ప్రపంచ ఎగుమతుల వృద్ధి కంటే భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఈ వృద్ధికి ప్రధానంగా ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాలు ఇంకా ఆభరణాలు, ఫార్మా, రసాయనాలు లాంటి రంగాలు కారణమని ఆయన వివరించారు.