
- 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్
- ఇప్పుడున్న ఐదు మాస్టర్ ప్లాన్ల స్థానంలో త్వరలో ఒకటే ప్లాన్
- ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ట్రిపుల్ఆర్ పనులు ప్రారంభమైన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,285 చ.కి.మీ. కాగా, తాజా నిర్ణయంతో మరో 4 వేల చ.కి.మీ. విస్తరించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోగా హెచ్ఎండీఏ పరిధిని పెంచాలని, ఓఆర్ఆర్ను దాటి మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
2050 సంవత్సరం నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశాల్లోనూ రీజినల్ రింగ్ రోడ్ ప్రాధాన్యం, హెచ్ఎండీఏ పరిధి పెంపుపై చర్చించినట్లు సమాచారం. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ మధ్య ఉన్న ప్రాంతాలను హెచ్ఎండీఏ కిందికి తీసుకొచ్చి, రెండు రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అధికారులు చెబుతున్నారు.
మెగా మాస్టర్ ప్లాన్పై కసరత్తు
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సిటీతోపాటు తెలంగాణ స్వరూపమే మారిపోనుంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ వరకు సెమీ అర్బన్ క్లస్టర్ గా అభివృద్ధి చేయనున్నారు. ట్రిపుల్ఆర్అవతలి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా అభివృద్ధి చేస్తారు.
ట్రిపుల్ఆర్ వరకు హెచ్ఎండీఏను విస్తరించిన తర్వాత, దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో హుడా, హడా, సీడీఏ, జీహెచ్ఎంసీ, ఎక్స్టెండెడ్ ఏరియా మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ట్రిపుల్ ఆర్ వరకు ‘మెగా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050’ను రూపొందించాలని నిర్ణయించారు. ఈ పనులను ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది.
మెగా మాస్టర్ప్లాన్కు సంబంధించిన కార్యక్రమాలను కూడా హెచ్ఎండీఏనే రూపొందిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రాంతాలను బట్టి వివిధ కేటగిరీల కింద మార్పు చేయనున్నట్టు సమాచారం. ఇందులో వివిధ జోన్లు ఉండనున్నాయి. 2050 నాటికి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలన్న విషయాన్ని మాస్టర్ప్లాన్లో వెల్లడించన్నారు.
ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఐటీ, గ్రీనరీ, ఎంటర్టెయిన్మెంట్ జోన్స్, అగ్రికల్చర్ జోన్, కన్జర్వేషన్ జోన్ఉండనున్నాయి. ఇలా వివిధ అవసరాలకు తగ్గట్టుగా జోన్లను విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.