బెంగళూరు: అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ అంశాలేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతులపై భారత్ ఆధారపడటంతో రూపాయి విలువ తగ్గుతోందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఆమె మాట్లాడారు.
‘‘రూపాయి విలువను ఒక స్థాయి వద్ద ఉంచడానికి ఆర్బీఐ ప్రయత్నించదు. విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మాత్రమే ఫారెక్స్ రిజర్వ్లను ఉపయోగించి మార్కెట్ను స్థిరంగా ఉంచడానికి జోక్యం చేసుకుంటుంది”అని ఆమె స్పష్టం చేశారు. చమురు, బంగారం, ఎరువుల కోసం భారీగా డాలర్ల రూపంలో చెల్లింపులు చేయాల్సి వస్తోందని, దీంతో రూపాయి బలహీపడుతోందని, కరోనా తర్వాత రూ. 3 వేలకు పెరిగిన ఎరువుల బస్తాను రైతులకు రూ. 300 కే అందిస్తూ, ప్రభుత్వం బస్తాకు రూ. 2,700 వరకు సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు. కర్ణాటకకు నిధుల వాటాపై వస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
