గద్వాల, వెలుగు: బీఆర్ఎస్ చేపట్టిన జలదీక్షతోనైనా కాంగ్రెస్ కండ్లు తెరవాలని, నడిగడ్డతో పాటు కృష్ణా తీర ప్రాంత ప్రజల గొంతు తడపాలని మాజీమంత్రి హరీశ్రావు చెప్పారు. తాగునీరు ఇవ్వడంతో పాటు, కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి ఐదు టీఎంసీల నీరు విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సోమవారం నడిగడ్డ జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్తో పాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ క్యాండిడేట్ ఆర్ఎస్. ప్రవీణ్కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సాగు, తాగునీరు, కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతగాక బీఆర్ఎస్ లీడర్ల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు ఇప్పించానని గుర్తు చేశారు. నారాయణపూర్ డ్యామ్లో ప్రస్తుతం 21 టీఎంసీల నీరు ఉందని, వీటిలో ఐదు టీఎంసీలను విడుదల చేయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
నాలుగు నెలల కాంగ్రెస్ పాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ తర్వాత చేతులెత్తేసిందని విమర్శించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో అభిలాషరావు, గడ్డం కృష్ణారెడ్డి, రాజారెడ్డి, విజయ్కుమార్, హనుమంతు పాల్గొన్నారు.