చండీగఢ్‌‌‌‌ లో 26 స్కూళ్లకు బాంబు బెదిరింపు

చండీగఢ్‌‌‌‌ లో 26 స్కూళ్లకు బాంబు బెదిరింపు
  • నిఖీల అనంతరం ఫేక్​మెయిల్స్​అని నిర్ధారించిన పోలీసులు 

చండీగఢ్/గురుగ్రామ్‌‌‌‌: పంజాబ్​రాజధాని చండీగఢ్‌‌‌‌లో బుధవారం 26 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. పాఠశాలల చుట్టూ భద్రతను పెంచి తనిఖీలు చేపట్టారు. అయితే, ఆయా పాఠశాలల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, ఆ ఈ మెయిల్స్​ఫేక్​ అని చండీగఢ్ సీనియర్ ఎస్పీ కన్వర్‌‌‌‌దీప్ కౌర్ తెలిపారు.

 ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎవరూ భయపడవద్దని సూచించారు. 25, 19, 45, 16 సెక్టార్లతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. దీంతో వెంటనే బాంబు డిస్పోజల్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌‌‌‌లను పాఠశాలల ప్రాంగణానికి తరలించి సోదాలు నిర్వహించామని ఎస్పీ మీడియాకు తెలిపారు. 

ఆ ఈ మెయిల్స్ ఒకే జీ మెయిల్ ఖాతా నుంచి వచ్చాయని, చండీగఢ్ పోలీసుల సైబర్ బృందం దానిని పరిశీలిస్తోందని ఆమె చెప్పారు. సెక్టార్ 17 పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాని పాఠశాలలు తెరిచి ఉన్నాయని ఎస్పీ తెలిపారు. 

గురుగ్రామ్‌‌‌‌లో 8 ప్రైవేట్​స్కూళ్లకు..

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌‌‌‌ లో ఎనిమిది ప్రైవేట్ పాఠశాల లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఉదయం 7.08 గంటల ప్రాంతంలో ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు క్యాంపస్‌‌‌‌లను మూసివేశాయి. స్కూల్​ బస్సులను  నిలిపివేశాయి. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులను కూడా వెనక్కి పంపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్​డీఆర్​ఎఫ్​బృందాలు కూడా స్పాట్​కు చేరుకున్నాయి.

 వెంటనే పోలీసు బృందాలు స్నిఫర్ డాగ్‌‌‌‌లతో క్యాంపస్‌‌‌‌లకు చేరుకొని సోదాలు నిర్వహించాయి. కాగా, ప్రాథమిక తనిఖీల అనంతరం ఆయా స్కూళ్లలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని, ఆ మెయిల్స్​ఫేక్​అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని గురుగ్రామ్ పోలీసు ప్రతినిధి సందీప్ కుమార్ తెలిపారు.