సీబీఐ ఆఫీసర్ అంటూ చలామనీ అవుతున్న ఓ వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని తమిళనాడు భవన్లో నిందితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కోర్టులో హాజరుపరుచగా అతడికి రెండు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
విశాఖపట్నం వాల్తేరుకు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి సీబీఐ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ పలువురి నుంచి డబ్బులు కాజేశాడని సీబీఐ విచారణలో తేలింది. తాను సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్గా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడని గుర్తించింది. శ్రీనివాస్ రావు వద్ద నుంచి రూ. 21 లక్షల నగదు, బంగారు అభరణాలు, స్టోన్స్ ను సీబీఐ సీజ్ చేసింది. ఓ డీల్ కు సంబంధించిన కేసులో అనుమానం వచ్చిన కొందరు సీబీఐకి ఫిర్యాదు చేశారు. అతడి ఫోన్ కాల్ ఆధారంగా ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో ఉంటున్న కొవ్విరెడ్డి శ్రీనివాస్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతడిని ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరుచగా.. రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.