
న్యూఢిల్లీ: ఫేక్ బ్యాంకులను చూశాం.. ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలను చూశాం.. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఫేక్ ఎంబసీని స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో ఉనికిలోనే లేని దేశానికి ఇండియాలో ఎంబసీ ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిందీ ఘటన. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఢిల్లీకి దగ్గర్లోని ఘజియాబాద్లో రెండంతస్తుల లగ్జరీ బిల్డింగ్ అద్దెకు తీసుకొని, వెస్ట్ఆర్కిటికా పేరుతో ఎంబసీని ప్రారంభించాడు.
తనకు తాను అంబాసిడర్గా పరిచయం చేసుకున్నాడు. ఆఫీసులో లగ్జరీ కార్లు, వాటికి ఎంబసీ స్టిక్కర్లు, పాస్పోర్టులు, ఫారిన్ కరెన్సీ, ప్రముఖులతో దిగినట్లు ఫొటోలు అందుబాటులో పెట్టాడు. ఈ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తూ హర్షవర్ధన్ జైన్ ఫేక్ రాకెట్ నడుపుతున్నాడు. యువతను, ప్రజలకు నమ్మించేందుకు ప్రధాని, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులతో దిగినట్లు ఫేక్ ఫొటోలు క్రియేట్ చేసి, ఎంబసీలో అంటించాడు.
మరోవైపు, 2011లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నాడన్న కారణంతో హర్షవర్ధన్ జైన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎంబసీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో విచారణ ప్రారంభించిన అధికారులు.. ఫేక్ ఎంబసీ ప్రాంతానికి వెళ్లి హర్షవర్ధన్ జైన్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 12 మైక్రోనేషన్స్ డిప్లమాటిక్ పాస్పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులు ఉన్న డాక్యుమెంట్స్, 34 దేశాల
స్టాంపులు, రూ.44 లక్షల నగదు, 18 డిప్లొమోటిక్ నంబర్ ప్లేట్స్ను స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్ఆర్కిటికా అనే దేశమే లేదు..
వెస్ట్ఆర్కిటికా అనేది అంటార్కిటికాలోని ఓ ప్రాంతం.. దేశం కాదు.. అయితే, అమెరికాకు చెందిన నేవీ ఆఫీసర్ మెక్ హెన్రీ 2001లో ఆ ప్రాంతాన్ని దేశంగా ప్రకటించాడు. తనకు తాను గ్రాండ్ డ్యూక్గా పరిచయం చేసుకున్నాడు. వెస్ట్ఆర్కిటికాకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదు. అంటార్కిటికాలో 6,20,000 చదరపు మైల్స్ తనదే అని చెప్పాడు. వెస్ట్ఆర్కిటికాలో 2,356 మంది జనాభా ఉన్నారని చెప్తున్నా.. అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు.