నకిలీ సీడ్​ వచ్చేసింది .. తనిఖీలు,అరెస్టులు చేస్తున్నా ఆగని దందా

నకిలీ సీడ్​ వచ్చేసింది .. తనిఖీలు,అరెస్టులు చేస్తున్నా ఆగని దందా
  • మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్​జిల్లాకు సరఫరా 
  • సీజన్ ప్రారంభానికి ముందే గ్రామాల్లో తిష్ట.. రైతులకు అంటగడుతూ దందా
  • జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ దాడులతో బయటపడుతున్న వైనం
  • గతేడాది తీవ్రంగా నష్టపోయిన అన్నదాత
  • నకిలీ విత్తనాల అమ్ముతున్న పలువురి అరెస్ట్ 

ఆదిలాబాద్, వెలుగు : పత్తి విత్తనాలు వేసుకోవడం ఇంకా మొదలే కాలేదు.. అప్పుడే గ్రామాల్లో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం పంట సాగుకు ముందే గ్రామల్లో నకిలీ విత్తనాల దళారులు చెలరేగిపోతున్నారు. వానాకాలం సాగు కోసం అన్నదాతలు ఇప్పుడిప్పుడే పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున లూజ్ విత్తనాలతో పాటు ప్యాకెట్లు అమ్ముతున్నారు. టాస్క్​ఫోర్స్ దాడుల్లో  జరిపి పలువురు నకిలీ విత్తనాల వ్యాపారులను అరెస్టు చేశారు.

గ్రామాల్లో పాగా..

ఆదిలాబాద్​జిల్లాలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతంలో పత్తి, సోయా పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈసారి ముందుగానే వర్షాలు పడుతుండడంతో రైతులు పత్తి, సోయాబీన్ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది విత్తన వ్యాపారులతో పాటు దళారులు జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు తెరలేపారు. మహారాష్ట్ర నుంచి విత్తనాలు తీసు కొచ్చి.. గ్రామాల్లో తిష్ట వేసి లూజ్, ప్యాకెట్ల రూపంలో రైతులకు అమ్ముతున్నారు. తక్కువ ధర అని, మంచి పంట వస్తుందని రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. షాపుల్లో ఇప్పటికే 15 లక్షల పత్తి విత్తనాలు అందుబాటులో ఉండగా.. వ్యాపారులు మాత్రం నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 20 వేల కిలోలకు పైగా లూజ్ విత్తనాలు, 100 ప్యాకెట్ల నకిలీ విత్తనాల ప్యాకెట్లు గ్రామాల్లో రైతులకు అమ్మినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇవి అధికారిక లెక్కలే అయినప్పటికీ భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 

టాస్క్ ఫోర్స్ దాడులు..

నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు ప్రారంభించారు. పోలీస్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా టాస్క్​ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మహారాష్ట్ర బార్డర్​లోని చెక్ పోస్టుల వద్ధ తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే ఇచ్చోడ, బేల మండలాల్లోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి ఆరుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సైతం జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా నకిలీ దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే నకిలీ విత్తన కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని, దాడులు చేపట్టాలని, రైతులకు అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే టాస్క్​ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా లూజ్ విత్తనాలు అమ్మితే రైతులు కొనవద్దు. అనుమతులున్న ఫర్టిలైజర్ షాపులోనే కొనాలి. నకిలీ విత్తనాలు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, ఇతర సమస్యలుంటే హెల్ప్ లైన్ నంబర్ 8712659965ను సంప్రదించాలి.  

ఎల్. జీవన్ రెడ్డి, డీఏస్పీ, ఆదిలాబాద్