నకిలీ విత్తనాలను అరికట్టాలి

నకిలీ విత్తనాలను  అరికట్టాలి

వ్య వసాయం అభివృద్ధి చెందాలన్నా,  రైతు దిగుబడి పెరిగి ఆదాయం ఆర్జించాలన్నా సాగులో విత్తనాలే కీలకం. విత్తనం మంచిదైతే పంట చేతికందితే అన్నదాతకు అదే సంతోషం. అలాంటిది మరి వేసవి అనంతరం సాగు మొదలవకముందే నకిలీ విత్తనాల బెడద మొదలైంది. ఇందుకు తెలంగాణలో వేరువేరు చోట్ల రూ.85 లక్షల విలువైన దాదాపు మూడు టన్నుల నకిలీ విత్తనాలు  పట్టుపడటం నిదర్శనం. అవన్నీ ఓ  ప్రముఖ సంస్థకు చెందినవి కావడం గమనార్హం. 

యాసిడ్ లు, రసాయనాలు కలిపిన విత్తనాలతో సొమ్ము చేసుకుంటున్నారు. కర్షకుల పట్ల కనికరం లేకుండా నట్టేట ముంచుతున్నారు. ప్రభుత్వ నామమాత్రపు చర్యలతో నకిలీలు పేట్రేగిపోతున్నారు. అలాంటి సంస్థలను నిషేధించి వాటి అనుమతులు రద్దు చేయాలి. విత్తన, పెస్టిసైడ్స్, రసాయన, ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలి. అంతిమంగా వ్యవసాయం, అన్నదాతను నకిలీ విత్తనాల బెడద నుంచి కాపాడాలి. నకిలీ విత్తనాల అమ్మకందార్లపై ప్రభుత్వం చెప్పినట్లుగా  పీడీ యాక్ట్​ ప్రయోగించాలి. 

- తలారి గణేష్, వెల్లంకి,  యాదాద్రి జిల్లా