జీడీపీలో 37.9 శాతానికి జంప్
8.2 శాతానికి పడిపోయిన సేవింగ్స్
న్యూఢిల్లీ: దేశంలో కుటుంబ అప్పులు (కుటుంబాలు తీసుకుంటున్న అప్పులు) పెరుగుతున్నాయి. కిందటేడాది డిసెంబర్ నాటికి, దేశ జీడీపీలో వీటి వాటా 37.9 శాతానికి పెరిగిందని ఆర్బీఐ డేటా పేర్కొంది. అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్లో, జీడీపీలో కుటుంబ అప్పులు 37.1 శాతంగా ఉన్నాయి. దీంతో వరసగా రెండో క్వార్టర్లోనూ ప్రజలు అప్పులు చేయడం పెరిగిందని తెలుస్తోంది. జూన్, 2020 నాటికి, జీడీపీలో 35.4 శాతంగా ఉన్న కుటుంబ అప్పులు, సెప్టెంబర్ క్వార్టర్లోనూ, డిసెంబర్ క్వార్టర్లోనూ పెరిగాయి. బ్యాంకులు అప్పులివ్వడం పెరుగుతుండడంతో, కుటుంబ అప్పులు పెరుగుతున్నాయని ఆర్బీఐ అంచనావేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇచ్చే అప్పులు తగ్గకపోయి ఉంటే, కుంటుంబ అప్పులు ఇంకా ఎక్కువగా ఉండేవని ఆర్బీఐ పేర్కొంది. మరోవైపు కుటుంబాల సేవింగ్స్ వరస క్వార్టర్లలో తగ్గుతున్నాయి. కిందేటేడాది డిసెంబర్ క్వార్టర్లో కుటుంబాల సేవింగ్స్ జీడీపీలో 8.2 శాతంగా ఉండగా, సెప్టెంబర్ నాటికి ఇది 10.4 శాతంగా నమోదయ్యింది.