శాయంపేట, వెలుగు: తనకు వారసత్వంగా వచ్చిన భూమిని పక్కపొలం యజమాని, అతని బంధువులు కబ్జా చేశారని.. తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటూ ఓ రైతు జడ్పీ చైర్ పర్సన్ కాళ్ల మీద పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన అరికిళ్ల సుధాకర్కి సర్వే నంబర్ 630/ సి/1, 630/ డిలో 1.5 ఎకరం భూమి ఉంది. సుధాకర్.. బుర్ర మల్లయ్య అనే రైతుతో కలిసి వ్యవసాయ బావి తవ్వించి సాగు చేసుకుంటున్నాడు. కాగా సుధాకర్పొలంలో నుంచి ఎస్సారెస్పీ కెనాల్ వెళ్లడంతో ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త పట్టా పాస్ బుక్లో అధికారులు కేవలం ఎకరం భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ఇదిలా ఉండగా పక్క పొలం రైతు అయిన అరికిల్ల వీరయ్య, అతని కుటుంబ సభ్యులు గతంలో పాతిన హద్దు రాళ్లను పీకి సుధాకర్పొలంలోకి పాతారు. ఇదేందని అడిగిన సుధాకర్పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తన పొలాన్ని సర్వే చేయాలని 3 నెలల క్రితం మీసేవలో దరఖాస్తు పెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల పత్తి గింజలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లిన సుధాకర్ను అరికిల్ల వీరయ్య కొట్టి చంపుతామని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ సుధాకర్సోమవారం శాయంపేట జడ్పీచైర్ పర్సన్ గండ్ర జ్యోతి కాళ్ల మీద పడ్డాడు. రైతుతో మాట్లాడిన జ్యోతి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.