పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆఫీసర్ల యత్నం..అడ్డుకున్న రైతులు, మహిళలు

పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆఫీసర్ల యత్నం..అడ్డుకున్న రైతులు, మహిళలు

కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తమకు జీవనాధారం లేకుండా పోతుందని చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్జెళ్లి రేంజ్‌‌లోని బండేపల్లి బీట్‌‌లో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రేంజ్‌‌ ఆఫీసర్‌‌ ఇక్బాల్‌‌ హుస్సేన్‌‌ సిబ్బందితో కలిసి వచ్చి పోడు భూముల్లో ట్రెంచ్‌‌ కొట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు, బాధిత కుటుంబాల మహిళలు వచ్చి పనులు చేయకుండా ప్రొక్లెయిన్‌‌ను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ భూములు లాక్కొని అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. ఎంత నచ్చజెప్పినా రైతులు పట్టువీడకపోవడంతో విషయం తెలుసుకున్న కాగజ్‌‌నగర్‌‌ ఎఫ్‌‌డీవో సుశాంత్‌‌ సుఖ్‌‌దేవ్‌‌ బోబడే వచ్చి రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములను రీ ట్రైవ్ చేస్తున్నామని, తాము ఎవరికీ అన్యాయం చేయడం లేదని చెప్పారు. రైతులు సాగు చేస్తున్న భూముల్లో సగం ఇవ్వాలని.. అందులో మొక్కలు నాటుతామని చెప్పినా వినకుండా భూములను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చివరకు ఎఫ్‌‌డీవో సుశాంత్‌‌, అటవీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.