రైతుబంధు చేతికందలే
లాగోడిమొదలైన పునాస.. రైతులకు తక్లీఫ్
కరోనా, లాక్డౌన్ అంటూ క్రాప్ లోన్లకు
సతాయిస్తున్న బ్యాంకర్లు ధరణి ప్రకారం లోన్లు
ఇవ్వడంపైనా గందరగోళమే వడ్లు అమ్మిన పైసలూ
మస్తు మందికి రాలే
రైతుబంధు చేతికొచ్చేసరికి విత్తనాలేసే టైమ్
అయిపోతదంటున్న రైతులు
ప్రైవేట్ల మిత్తికి తెచ్చి పొలాలు రెడీ చేస్కుంటున్నరు
హైదరాబాద్, వెలుగు: పునాస సీజన్ మొదలవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దుక్కి దున్ని విత్తనాలు అలుక్కుందామంటే చేతిలో పైసలు లేక దిక్కులు చూస్తున్నారు. అటు బ్యాంకులు క్రాప్ లోన్లు ఇవ్వక.. ఇటు వడ్లు అమ్మిన పైసలు చేతికి రాక.. మరోవైపు రైతుబంధు సాయం ఇంకా అందక లాగోడి కోసం తిప్పలు పడుతున్నారు. కరోనా, లాక్డౌన్ పేరుతో కొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయి. క్రాప్ లోన్ యాక్షన్ ప్లాన్ రాలేదని తిప్పి పంపుతున్నాయి. ధరణి పోర్టల్ ప్రకారం లోన్లు ఇచ్చే విషయం ఇంకా గందరగోళంగానే ఉంది. ధాన్యం అమ్మిన పైసలను ఖర్చు చేద్దామంటే అవి కూడా చాలా మంది ఖాతాల్లో జమ కాలేదు. రైతు బంధును ఈ నెల 15 నుంచి ఇస్తామని సర్కారు చెప్పినా అవి చేతికొచ్చేసరికి విత్తనాలు వేసుకునే టైమ్ మించిపోతదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోదారి లేక బయట ప్రైవేటులో మిత్తికి పైసలు తెచ్చుకొని చెలకలు, పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు.
యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయలే
ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పత్తి 70 లక్షల ఎకరాలు, వరి 41.85 లక్షల ఎకరాలు, కంది 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు.