- కల్లూర్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
- మార్క్ఫెడ్ డీఎంతో వాగ్వాదం
కుంటాల, వెలుగు: సోయా, పత్తి, వరి పంట దిగుబడులను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో రైతులు రోడ్డెక్కారు. కల్లూర్ హైవేపై మంగళవారం రాస్తారోకో చేశారు. సోయా బస్తాలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, మార్క్ ఫెడ్, సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల ఆందోళనతో నిర్మల్–బైంసా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మార్క్ ఫెడ్ డీఎం మహేశ్ అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న సోయా, పత్తి ని తేమ శాతం పేరుతో కొనకుండా అన్యాయం చేస్తున్నారని డీఎంపై మండిపడ్డారు.
ఆయనతో వాగ్వాదానికి దిగారు. కొనుగోలు కేంద్రాల్లోనే అధికారులు ధాన్యాన్ని పరిశీలించి బట్టి గ్రేడ్లు కేటయించి కొ నుగోలు చేస్తామని తహసీల్దార్ కమల్ సింగ్ ఎదుట డీఎం హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ధర్నాలో వివిధ గ్రామాల రైతులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
