- సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : ‘రైతు డిస్కం వ్యవసాయానికి ఉరితాడుగా మారుతుంది, ఆర్పీడీసీఎల్తో లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కరెంట్ కష్టాలు ఏర్పడి సాగు, తాగునీటికి పథకాలకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవంత్రెడ్డి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.
ఆదివారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కంల అప్పులపై సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో డిస్కంలకు రూ. 25,284 కోట్ల బకాయి పడిందన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే మూడో డిస్కం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 8, 9 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అవుతోందన్నారు. కేవలం పగలు మాత్రమే కరెంట్ ఇస్తే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి వస్తుందని, దీని వల్ల అవి పాడైపోతాయన్నారు.
ఆర్పీడీసీఎల్ వల్ల కొత్త సమస్యలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, ఉచిత కరెంట్ను పక్కన పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పూటకో పార్టీ మారే రేవంత్రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ప్రయాణం అంతా బీఆర్ఎస్తోనేని గతంలో చాలా సార్లు చెప్పానని, ఇప్పుడు మళ్లీ చెబుతున్నానన్నారు.
సమావేశంలో రాధాకృష్ణ శర్మ, గుండు భూపేశ్, కాముని శ్రీనివాస్, మారెడ్డి రవీందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని బేతస్త ప్రార్థనా మందిరం వార్షికోత్సవానికి హాజరయ్యారు. కన్వెర్టెడ్ క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుతో అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ విషయంపై పునరాలోచన చేయాలన్నారు. అంతకు ముందు యాదవ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యాదవ ప్రతిభా పురస్కాల కార్యక్రమం, శివమ్స్ గార్డెన్లో జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొన్నారు.
