దండేపల్లి:వెలుగు: వడ్లు కొనుగోలు చేసి నెల రోజులైనా ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలేదంటూ రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ వద్ద మెయిన్రోడ్డుపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వల్ల వర్షానికి వడ్లు తడిసి నష్టపోయామని, మిల్లర్లు బస్తాకు 4 కిలోల చొప్పున కట్ చేసినా అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడ్లు అమ్మి రైస్ మిల్స్ తరలించి నెల రోజులు దాటినా ఇంకా డబ్బులు జమ కాలేదని, అప్పుల మీద వడ్డీలు పెరిగి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి ఎస్సై ప్రసాద్ రైతుల దగ్గరకొచ్చి మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తొందరగా డబ్బులు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.