- పహల్గాం ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసిందెవరని ప్రశ్న
- ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు
- ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన, దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని కామెంట్
కోల్కతా: దేశంలోకి చొరబాట్లు కేవలం బెంగాల్లో మాత్రమే జరుగుతున్నాయా.. కాశ్మీర్లో జరుగుతున్న చొరబాట్ల సంగతేంటని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. మంగళవారం బంకురా జిల్లాలోని బర్జోరాలో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. బెంగాల్లో ఉగ్రవాద నెట్వర్క్లు విస్తరిస్తున్నాయన్న అమిత్ షా ఆరోపణలకు దీదీ కౌంటర్ ఇచ్చారు. టెర్రరిస్టులు ఇక్కడ ఉంటే పహల్గాం ఉగ్రదాడి, ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడింది ఎవరని ప్రశ్నించారు.
దేశంలో ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలమైనందుకు కేంద్ర హోంమంత్రి పదవికి రిజైన్ చేయాలంటూ అమిత్ షాను డిమాండ్ చేశారు. ‘‘ఈరోజు బెంగాల్కు దుశ్శాసనుడు వచ్చాడు. ఎన్నికలు దగ్గరపడినప్పుడల్లా ఇక్కడికి దుర్యోధన, దుశ్శాసనులు వస్తుంటారు” అంటూ అమిత్ షాపై పరోక్ష విమర్శలు చేశారు. చొరబాట్లు కేవలం బెంగాల్లోనే జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకు బెంగాల్ను మాత్రమే నిందిస్తున్నారు? అని దీదీ ప్రశ్నించారు.
సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులు ఎట్లొచ్చినయ్ ?
బెంగాల్ ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే సరిహద్దుల్లో కంచె నిర్మించలేకపోతున్నామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మమతా బెనర్జీ ఖండించారు. తారకేశ్వర్-–బిష్ణుపూర్ రైల్వే లైన్, బొంగావ్, పెట్రాపోల్, ఘోజాదంగ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో భూములను తామే ఇచ్చామని, తాము స్థలాన్ని ఇవ్వడం వల్లే రాష్ట్రంలో అన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
బీజేపీ నేతలు చెప్పే అబద్ధపు మాటలను బెంగాల్ ప్రజలు నమ్మబోరని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో బీజేపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ‘‘మీరు రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజార్టీతో గెలుస్తామని చెబుతున్నారు. మరి ఈసారి ఎందుకు ఆబ్ కీ బార్ దో సౌ పార్ అని చెప్పడం లేదు? మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు” అని అమిత్ షానుద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగాల్లో తమ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
