
నర్సంపేట/నెక్కొండ/నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం బారులతీరారు. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం క్యూ కట్టారు. అధికారులు ఒక్కో బస్తా యూరియా మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆఫీసర్లతో గొడవకు దిగారు. నెక్కొండ పట్టణంలోని సోసైటీ ఎదుట యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. ఉదయం నుంచి వేచి ఉన్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. నల్లబెల్లిలో సొసైటీలో యూరియా ఇస్తున్నారని తెలుసుకొని రైతులు తరలివచ్చి బారులుతీరారు.
ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పున ఇవ్వాలని అధికారులు నిర్ణయించడంతో, నాలుగు బస్తాలు ఇవ్వాలని గొడవకు దిగారు. ఎస్సై గోవర్ధన్ అక్కడికి చేరుకొని రైతులను సమాధానపరిచారు. యూరియా బస్తాతో పాటు నానో యూరియా అందించారు.