ధరణిలో రైతుల గోస పట్టదా..?​

ధరణిలో రైతుల గోస పట్టదా..?​

ధరణితో రైతుల గోస.. కామారెడ్డి ఏరియాలో భూ అక్రమాలపై బీజేపీ చేపట్టిన ఆందోళన మంగళవారం నుంచి మరింత తీవ్రతరం కానుంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగుతుతున్నట్లు ప్రకటించడం జిల్లాలో రాజకీయం హీటెక్కింది. మరో వైపు ధరణికి సంబంధించిన సమస్యలపై కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించడం.. ఆయనకు లీడర్లు కౌంటర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. - కామారెడ్డి, వెలుగు

ధరణిలో రైతుల గోస పట్టదా : అరుణతార

రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే ధరణితో  కొత్త సమస్యలు వచ్చాయని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ధరణితో రైతుల గోస, భూ అక్రమాలపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో చేపట్టిన నిరహార దీక్షలు సోమవారంతో ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల చక్రబంధంలో కలెక్టర్​ పనిచేస్తున్నారన్నారు. ఒక్కో తహసీల్దార్ ఆఫీసులో వెయ్యి నుంచి 2 వేల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోలీసులు దీక్షను భగ్నం చేస్తే  గ్రామాల్లో నిరాహార దీక్ష చేస్తామన్నారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా వైస్​ ప్రెసిడెండ్‌‌‌‌లు భరత్, వెంకట్‌‌‌‌రెడ్డి,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు  సుజిత, మానస పాల్గొన్నారు.   

సమస్యలు పరిష్కరిస్తున్నాం :  కలెక్టర్‌‌‌‌‌‌‌‌ 

ధరణిలో భూ సమస్యలపై అప్లికేషన్లను పరిష్కరిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్​జితేష్ వి పాటిల్ చెప్పారు. బీజేపీ చేస్తున్న ఆందోళనతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సోమవారం స్పందించి మీడియాతో మాట్లాడారు. అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో లేకుండా నిర్ధేశించిన గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. కామారెడ్డి టౌన్‌‌‌‌లోని సర్వే నంబర్​ 6లోని భూమి స్వాధీనానికి మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారన్నారు. భూములకు సంబంధించి ధరణి వెబ్ సైట్‌‌‌‌లో  జిల్లాకు సంబంధించి 17,749 అప్లికేషన్లు వస్తే ఇందులో 15,570 పరిష్కరించడం జరిగిందన్నారు. 2,179  పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని వివరించారు. అప్లికేషన్లు ఎక్కడ కూడా ఆపవద్దని తహసీల్దార్లకు సూచించామన్నారు. ప్రజలు ఎవరూ ఇబ్బందిపడొద్దని, 100 శాతం సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.