- 19 రోజుల తర్వాత రైతు ఖాతాలోకి నిధులు
వేములవాడ, వెలుగు: సీసీఐ కొనుగోలు సెంటర్లో ఓ రైతు పత్తి అమ్మగా.. దానికి సంబంధించిన డబ్బులు రాజరాజేశ్వర ఆలయ ట్రస్ట్ ఖజానాలో జమ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. వేములవాడకు చెందిన ఏదుల సత్తెమ్మ అనే మహిళా రైతు తన పత్తిని ఈ నెల 6న నాంపల్లిలోని జిన్నింగ్ మిల్లులోని సీసీఐ సెంటర్లో అమ్మింది.
దీనికి సంబంధించి రూ.2,14,549 ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమయినట్టు 11న ఆమె ఫోన్కు మెసేజ్ వచ్చింది. నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన ఆమెకు.. నగదు పడలేదని ఎస్బీఐ అధికారులు చెప్పారు. దీంతో బ్యాంకు, సీసీఐ అధికారుల చుట్టూ తిరగగా.. చివరికి రాజరాజేశ్వర ఆలయ ట్రస్టు ఖజానాలో జమయినట్లు గుర్తించారు.
పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు 19 రోజుల తర్వాత మంగళవారం ఆ డబ్బును రైతు అకౌంట్లో జమ చేశారు. కాగా కొన్ని నెలలుగా ఆమె గ్యాస్కనెక్షన్ నగదు కూడా రాజన్న ఆలయ ట్రస్ట్ ఖజనాలో జమవుతున్నట్లు గుర్తించారు.
