తమ భూమిలో గుడి కట్టొద్దంటూ తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం

తమ భూమిలో గుడి కట్టొద్దంటూ  తండ్రీకొడుకుల ఆత్మహత్యాయత్నం
  • సర్కారు భూమి అంటూ వాదించిన అయ్యప్ప మాలధారులు
  • బతిమిలాడినా వినకపోవడంతో పురుగుల మందు తాగిన్రు

పెనుబల్లి, వెలుగు : తమ  భూమిలో గుడి కట్టొద్దని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్​సోమాల్​నాయక్​తండాలో గురువారం తండ్రీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..తండాకు చెందిన మీటూ (60)కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే, అది ప్రభుత్వ భూమి అని, అక్కడ గుడి కట్టాలని కొంత మంది అయ్యప్ప మాలధారులు గురువారం సాయంత్రం ఆ భూమిలో ఫ్లెక్సీ కట్టేందుకు వచ్చారు. దీంతో కొడుకు కృష్ణతో కలిసి మీటూ వారిని అడ్డుకున్నాడు.

ఈ భూమి తమదని, ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్నామని, తమ పొట్ట కొట్టవద్దంటూ బతిమిలాడారు. అయినా వారు వినకుండా గుడి కట్టి తీరతామని స్పష్టం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన వారు అక్కడే పురుగుల మందు తాగారు. స్థానికులు వెంటనే వారిని మండల కేంద్రంలోని గవర్నమెంట్​దవాఖానకు తరలించారు. కృష్ణ పరిస్థితి మిషమంగా ఉండడంతో ఖమ్మం తీసుకువెళ్లారు. వీఎం బంజర్​ ఎస్సై సూరజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.